ఎన్నికల్లో తొలిసారిగా యాప్ సాంకేతికత
ఎన్నికల్లో తొలిసారిగా యాప్ సాంకేతికత
5 రాష్ర్టాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఎన్నికల సంఘం యాప్ సాంకేతికతను వినియోగిస్తున్నది. అధికారుల కోసం ఈ-ఎస్ఎంఎస్, పౌరుల కోసం సీ-విజిల్ యాప్స్ను ప్రవేశపెట్టింది.
అధికారులకు ఈ-ఎస్ఎంఎస్, పౌరుల కోసం సీ-విజిల్
ఐదు రాష్ర్టాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఎన్నికల సంఘం
హైదరాబాద్, అక్టోబర్ 10 తెలంగాణ): ఐదు రాష్ర్టాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఎన్నికల సంఘం యాప్ సాంకేతికతను వినియోగిస్తున్నది. అధికారుల కోసం ఈ-ఎస్ఎంఎస్, పౌరుల కోసం సీ-విజిల్ యాప్స్ను ప్రవేశపెట్టింది. తనిఖీలలో దొరికే నగదు, మద్యం, డ్రగ్స్, బహుమతులను ఎప్పటికప్పుడు ఆయా సంస్థలకు అప్పగించడానికి, డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి, ఐటీ శాఖను సకాలంలో అప్రమత్తం చేయడానికి 'ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్’ (ఈ-ఎస్ఎంఎస్) అనే యాప్ను వినియోగిస్తున్నది.
ఎన్నికల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనే అధికారులందరూ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని, ఎప్పటికప్పుడు వివరాలను ఈఎస్ఎంఎస్ యాప్లో పొందుపర్చాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో దొరికిన నగదు, మద్యం, డ్రగ్స్ వంటి వివరాలను సరైన సమయంలో నమోదు చేయకపోవడం వల్ల కొంత దుర్వినియోగం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈసారి పకడ్బందీగా నిర్వహించేందుకు ఈ-ఎస్ఎంస్ఎస్ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
అక్రమాలపై ఫిర్యాదుకు..
ఎన్నికల వేళ జరిగే అక్రమాలను పౌరులు ఎప్పటికప్పుడు సీవిజిల్ యాప్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు. ఎవరైనా కోడ్ను ఉల్లంఘించినా కూడా ఆ ఘటనలను ఈయాప్ద్వారా తెలియజేయవచ్చు. ఆయా పార్టీల అభ్యర్థులు పంచే డబ్బులు, మద్యం, బహుమతులు వంటి వివరాలను నేరుగా 'సీ-విజిల్’ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే లౌడ్స్పీకర్లు వాడినా, మతాలు, కులాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, పర్మిషన్ లేకుండా ఎన్నికల ర్యాలీలు నిర్వహించినా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
ఈ యాప్ను గూగుల్, యాపిల్ ప్లే స్టోర్ల నుంచి డౌన్లోడ్ చేసుకొని తమ చుట్టుపక్కల జరుగుతున్న అక్రమాలను పొందుపరచవచ్చు. ఈ యాప్ను ఇప్పటికే పది లక్షల మంది పౌరులు డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా అందిన ఫిర్యాదులపై పది నిమిషాల వ్యవధిలోనే సంబంధిత అధికారులు అక్కడికి వచ్చి తగిన చర్యలు తీసుకుంటారు. ఈ చర్యల ద్వారా ప్రజల్లో, వ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుందని ఎన్నికల కమిషన్ భావిస్తున్నది.
Oct 13 2023, 16:52